పూనకాలు లోడింగ్.....

 



 పూనకాలు లోడింగ్.....

 

కాటుక మంచిదే కానీ, కన్ను పోయేటంతగా రెచ్చిపోతే ఎలా ? ఈ మధ్యకాలంలో తెలుగునాట ఏ చిన్న సంబరం కనిపించినా కాళ్ళు భూమి మీద నిలవడం లేదు, శివాలెత్తినట్టు ఊగిపోతున్నారు.  ఇల్లు అలికే సంబరంలో ఈగ తన పేరు మర్చిపోయిన కథ చిన్నప్పుడు చదువుకున్నాం... గుర్తుండే ఉంటుంది.

 

నాకు గుర్తున్నంతవరకు భోగి మంటలప్పుడు (నాదీ గ్రామీణ నేపథ్యమే)మగవారి హడావిడి ఎక్కువ. ఎండిన చెట్లకొమ్మలు, మొద్దులు, ముళ్ళకంపలు, పాడయిపోయిన, పనికిరాని ఇంటితాలూకు చెక్క సామాగ్రివంటి వాటిని ముందురోజు రాత్రినుంచే సేకరించి తెల్లవారక ముందే ... పిడకలు పెట్టి మంటపెట్టి తరువాత ఒక్కొక్కటిగా దానిమీద వేస్తుంటే, ఇరుగుపొరుగంతా  దాని చుట్టూ చేరి సంబరంగా గడపడం... పొద్దున తిన్నంత తిని చిరుతిళ్ళు జేబుల్లో కుక్కుకుని గాలిపటాలు తీసుకుని కుర్రకారు ఇల్లొదిలితే... ఎప్పుడో ఆకలేసినప్పడు వచ్చి గబగబా అంత లాగించేసి.. అప్పటికే బయట నుంచి దోస్తుల అరుపులు, కేకలు...చెయ్యికూడా సరిగా కడుక్కోకుండానే ఒక్క దూకుడు బైటికి.....

 

ఆడవాళ్ళు మాత్రం చిన్నాపెద్దా..చీకటితోనే లేచి ఇంటిముందు శుభ్రం చేసుకుని కళ్ళాపి చల్లి, ఆవుపేడ, గుమ్మడిపూలతో గొబ్బిమ్మలను సిద్ధం చేసుకుని,  పోటీలుపడి ముగ్గులు వేయడం... వేసినవాటిని ఇంటికొచ్చిన అతిథులు, పిల్లాజెల్లాతో కలిసి... పోల్చి చూసుకుంటూ ఎడతెగని ఆనందాలతో మైమరిచిపోతుంటే....  లోపల అమ్మలు, బామ్మలు పిండివంటలతో ఫుల్ బిజీ...పొద్దుగుంకి చీకటిపడేవేళకు.... చిన్న పిల్లలకు భోగిపళ్ళు, ఈడొచ్చిన పిల్లలతో కలిసి బొమ్మలకొలువులతో పేరంటాల సందడి...

 

 పెద్ద పండక్కి సెలవులియ్యంగానే  కూతుళ్ళు, అల్లుళ్లు, ఇతర కుటుంబ సభ్యులు వస్తున్నారని ....మూడు నాలుగురోజుల ముందునుంచే ఇల్లూవాకిలి శుభ్రం చేసుకోవడాలు, సర్దుకోవడాలూ, ఇంటికి కావలసిన సరుకులు, ఇంటిల్లిపాదికీ బట్టలు కొనుక్కోవడాలు....ఒకటే హడావిడి..తీరిక దొరికేది కాదు ఎవరికీ..

 

మూడో రోజు కనుమ పండుగ. నిజంగా ఆరోజు ఎద్దులకు పండగే. అన్ని రకాల చాకిరీ నుంచి వాటికి ఫుల్ హాలిడే. శుభ్రంగా వాటిని కడిగి పసుపు కుంకుమలతో అలంకరించడం... అవి ఇష్టంగా తినేవాటిని తినిపించడం, వాటితో ఆటాపాటా... ఎడ్లపందాలు, వాటికి తోడు కోళ్లపందాలు.....వగైరా... అది పశువుల పండగగా మాత్రమే ప్రసిద్ధి. కనుమనాడు కాకయినా కదలదంటూ ఇంటికొచ్చిన వారిని వెళ్ళనిచ్చేవారు కాదు. ఆత్మీయంగా అడ్డుకునేవారు...

 

మరిప్పుడో...

అడితినుంచి వంట చెరుకుగా ఉపయోగించే కట్టెలను కొనుక్కొచ్చి త్రికోణాకారంలో పేర్చి, దానికి పూలు చుట్టి, దండలు వేసి, దాని చుట్టూ ఆడవారే ఎక్కువగా చేరి చప్పట్లు కొడుతూ ఆడడం పాడడం... అన్ని పండగలకు బతకమ్మ ఫార్మాటే... మధ్యలో డాండియా కూడా... ఫ్లాట్ల సెటప్ లో ముగ్గులకు చోటుండదు.. అగ్గిపెట్టెలాంటి ఇంటిముందు మరో చిన్న కుంకుమ భరిణంత ముగ్గు... ఎంత ఖర్చుపెట్టినా, ఎంత సందడి చేసినా అంతవరకే... (అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అందరూ కలిసి అది వేరే విషయం...)

 

పిండివంటలకు ప్రాంతీయ భావోద్వేగాల వైరస్ సోకి తెలంగాణ పిండివంటలు, ఆంధ్రా పిండివంట లంటూ రెండు కుంపట్లు వెలుగుతున్నాయి...అటూ ఇటూ ఒకటో అరో తప్ప అన్నీ అవే ఐటమ్స్.... భావోద్వేగాలను... అమ్మేవారు సొమ్ము చేసుకుందామనుకున్నా...కొనేవారిలో మాత్రం ... నోటికి నచ్చింది, కంటికి నప్పింది కొనేసుకుంటూ పోతున్నారు, ఏ కుంపటిదని చూడకుండా.....ఇంటిపట్టున చిరుతిళ్ళు తయారు చేసుకునే అలవాటును మనం ఎప్పుడో వదులుకున్నా... పండగలప్పుడు కూడా వాటి తాలూకు ప్రత్యేక వంటల వాసనలు ఏ వంటింట్లోనూ కనిపించడం లేదు. స్వగృహ, స్విగ్గీల సంస్కృతి బాగా ప్రబలిన తరువాత పండగ రోజుల్లో పొయ్యి వెలగడం లేదు. దీనికి మేము కూడా మినహాయింపేమీ కాదు. మొన్ననే అరిసెలు, చక్కిలాలవంటివి కొని తెచ్చేసుకున్నాం. నిన్న పొద్దున మా పనిమనిషి.. లంబాడీ పిల్లను ...‘ఏం రజితా ! కూతురు హాస్టల్ నుంచి వచ్చింది కదా... పండక్కి పిండివంటలు ఏ కొంటున్నావ్’ అనడిగితే... చెంప చెళ్ళుమనే జవాబిచ్చింది... ‘అరిసెలు, సకినాలు నేనే చేస్తున్నా సారూ... అయి కూడా బైటినుంచి కొంటామా...’’ అంది అమాయకంగా... అంటే ఆచారాలను, సంస్కృతిని... అవి కొన ఊపిరితో ఉన్నా.... వాటిని ఇంకా ఎవరు బతికిస్తున్నారు... ఈ రజితలే... మనం కాదు.

 

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే....

పైన చెప్పిన దాంట్లో ఆక్షేపించాల్సినదేమీ లేదు. ఎవరినీ తప్పుపట్టాలసిన అవసరమేమీ లేదు... కాలం మారుతున్నది. దానికి తగ్గట్టు జీవనశైలి కూడా మారుతున్నది. ఓ 20 ఏళ్ళ తరువాత ఈ అనుభవాలే... ఇప్పటి తరానికి అప్పుడు... ఆపాత మధురాలు......

 

అయితే... ప్రతి పండగకూ ఒక ప్రత్యేకత ఉంటుంది... దానిని తీసేసి పండగ జరుపుకుంటున్నాం. ఒఠ్ఠిగా కూడా కాదు... పూనకాలు లోడింగ్ చేసుకుంటున్నాం....

 

బతకమ్మనృత్యాలు బతకమ్మ పండక్కి ప్రత్యేకం.. అన్నిటికీ  అవే స్టెప్పులేస్తే... బతకమ్మ ప్రత్యేకత పోతుంది కదా !  అది మంచిదా !!! దాని విశిష్ఠతను కాపాడుకోవాలి కదా !   అలాగే మనకంటూ ప్రత్యేకంగా కోలాటాలున్నాయి,  కోలాటం పాటలున్నాయి.. జడకోలాటం వంటి ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ప్రక్రియలున్నాయి. వాటిని వదిలేసి, వాటిని కాపాడుకోకుండా, వాటిని అభివృద్ది చేసుకోకుండా దాండియాలు దిగుమతి చేసుకోవడం అవసరమా !

 

అన్నింటా మన ప్రత్యేకతను కోల్పోతున్నాం.. చివరకు మన వస్త్ర ధారణ కూడా....మన ప్రత్యేకత-అడ్డ పంచె కాదు, కానే కాదు. ధోవతి మన సొంతం. శుభకార్యం అయినా, అశుభం అయినా.. ధోవతితోనే తంతు నడపాలి... తప్పదు కాబట్టి అంతవరకు నడుపుతున్నాం. ఇంత ప్రబలమైన సంస్కృతి ఉన్నా... అడ్డపంచెతో ‘రామరాజ్’ అడ్వర్టయిజ్మెంట్ చూపి ఇదీ మన తెలుగు సంస్కృతి అని ఓ సినీ నటుడు చెప్పంగానే ... ఇదేమన సంస్కృతి అనుకుని ఫంక్షన్లలో యువత అడ్డపంచెలతో సంబరాలు చేస్తుంటే మురిసిపోతున్నాం.

 

ఏతావాతా చెప్పేదేమిటంటే... తెలుగువారిగా మనకున్న ప్రత్యేకతలన్నీ మనం ఒక్కొక్కటిగా వదిలేసుకుంటున్నాం. మన ఉనికిని మనమే పోగొట్టుకుంటున్నాం.

 

ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు... ఇవన్నీ మన ఆస్తి, మన పెద్దలు మనకిచ్చిన అమూల్యమైన సంపద. మన ఆత్మగౌరవానికి ప్రతీకలు. వీటిని ప్రభుత్వాలు నిలపవు. వ్యక్తిగత, సామాజిక చిత్తశుద్ధిమీద ఆధారపడి ఉంటాయి.  ఒకప్పుడు వీటికి అవసరమైన మార్గదర్శనం సమాజం నుండే అంతర్లీనంగా అందేది...

 

ఇప్పుడు ఆ లింక్ మిస్సింగ్....మనుషులు, కుటుంబాల మధ్య చాలా లింకులు ఇప్పటికే... అలాగే ఇది కూడా....

 

ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న తరువాత ఇప్పుడు ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఉత్సాహం పెరిగింది. ఏ చిన్న అవకాశం వచ్చినా, ముఖ్యంగా సంబరాలకు సంబంధించినది... చిన్నాపెద్దా ముసలీ ముతకా అందరూ ఒక రేంజ్ లో ఊగిపోతున్నారు.... అది ఆహ్వానించదగిన పరిణామమే. అయితే దానికి ఆలోచన, మన ఆచార వ్యవహారాలు ఏవో తెలుసుకోవాలన్న ఆరాటం, వాటిని నాలుగు కాలాలు నిలుపుకోవాలన్న ఆసక్తి  ఉంటే...

 

ఆ మిస్సింగ్ లింక్ దొరికనట్టే....

 

-చినవ్యాసుడు

.....................



జడకోలాటం

https://www.youtube.com/watch?v=vCPusgz3RDM

https://hydnews-net.translate.goog/2021/06/jadakoppu-kolatam-an-art-to-celebrate-laboured-folklore-in-telangana/?_x_tr_sl=en&_x_tr_tl=te&_x_tr_hl=te&_x_tr_pto=tc

 

ఎవడ్రా ఈ రామోజీ రావ్ !!!

 



ఎవడ్రా ఈ రామోజీ రావ్ !!!

 

 ...అని అడిగింది ఎవరో కాదు.... ప్రఖ్యాత చలన చిత్ర నేపథ్య గాయకుడు  శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం.

1978-79 ప్రాంతంలో... నేను మద్రాసు వెళ్ళా... వారి కుటుంబంతో  పరిచయం కారణంగా వారింట్లోనే బస.  ఏం చేస్తున్నావు రా! (అంటే ఉద్యోగం ఎక్కడ చేస్తున్నావు ?) అని బాలసుబ్రహ్మణ్యం అడిగినప్పుడు ‘ఈనాడు’ అని చెప్పగానే ... ఆ మరుక్షణం అప్రయత్నంగా ఆయన నోటివెంట చాలా కుతూహలంగా వచ్చిన ప్రశ్న అది...

వివరాల్లోకి వెడితే....

తెలుగునాట అప్పటికే సంచలనం సృష్టిస్తున్నది ఈనాడు దిన పత్రిక. అధికారంలో ఉన్న వారి నిద్ర చెడగొడుతున్నది. జర్నలిజంలో వినూత్నపోకడలు, రాజకీయంగా సంచలనాత్మక కథనాలు, పరిశోధనాత్మక వార్తాకథనాలకంటే... ‘ఎవ్వడికీ భయపడం’... అన్న చందంగా సాహసోపేతంగా వదులుతున్న బాణాలు... వీటితో ఈనాడు ఒక పత్రికగా అమ్మకాలు పెంచుకుంటూ, స్థిరంగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే....

ఒక పత్రిక స్వతంత్రంగా, ధైర్యంగా వ్యవహరిస్తూ పోతూ దానికాళ్ళమీద అది నిలదొక్కుకోవాలంటే... ఆర్థికంగా అండదండలు గట్టిగా ఉండాలన్న సంకల్పం యాజమాన్యానికి ముందు నుంచీ ఉంది. దానికి సాక్ష్యమే... పత్రికకంటే ముందు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ను  విజయవంతం చేయడం. ఇది ఇచ్చిన వెన్నుదన్నుతోనే ఈనాడు పురుడు పోసుకుంది. సుఖ ప్రసవం అయింది. (చెన్నారెడ్డి కాలంలో ప్రభుత్వ ప్రకటనలు పూర్తిగా ఆపేసినప్పుడు పత్రిక తట్టుకుంది. తరువాత జలగం వెంగళరావు కాలంలో ఈనాడును నియంత్రించడానికి పరోక్షంగా మార్గదర్శిపై చర్యలు తీసుకోవడానికి చిట్ ఫండ్ చట్టం పేరిట కొన్ని ప్రయత్నాలు జరిగినప్పుడు... ఈనాడు మార్గదర్శికి తోడ్పడింది). అయితే కేవలం మార్గదర్శి మీద ఆధారపడకుండా ఈనాడు పాపులారిటీని పెట్టుబడిగా పెట్టి...ఇతరత్రా వ్యాపారాలు అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పటికే ‘ఇమేజెస్’ అనే హోర్డింగ్ కంపెనీ, కిరణ్ యాడ్స్ పేరిట ఒక యాడ్ ఏజన్సీ, సితార సినిమా పత్రిక ఈనాడుకు అన్నివిధాలా తోడ్పడుతూ పోతున్నా... పూర్తిగా మీడియా రంగానికి భిన్నంగా ప్రారంభమైన వ్యాపారం –‘ప్రియా ఫుడ్స్’..అనే నిల్వ పచ్చళ్ళ వ్యాపారం.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించే సమయానికి.. ఈ రంగం ఎలా ఉండేది... 

హైదరాబాద్ రాజధాని కావడంతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్న  ఆంధ్రాప్రాంతం వారు, పనులమీద, వ్యాపార అవసరాలకొద్దీ నగరానికి వచ్చిపోయే ఫ్లోటింగ్ జనాభా పెరుగుతూ పోతుండడంతో ...వీళ్ళ రుచులు, అభిరుచులు, అవసరాలు, ప్రయోజనాలకోసం..‘ఆంధ్రా మీల్స్’ ‘ఆంధ్రా భోజనం’ ఆకర్షణగా హోటళ్ళు, మెస్‌లు వెలిసాయి. పూతరేకులు, బందర్ లడ్లవంటి పక్కా ఆంధ్రా పిండివంటలు కూడా అక్కడక్కడా దొరుకుతూ ఉండేవి. ఆ కోవలోకి కొత్తగా వచ్చి చేరినవి...ఊరగాయలు, ఇతర నిల్వ పచ్చళ్ళే అయినా.. మిగిలిన వాటిలాగా వీటికి అంత ఆదరణ ఉండేది కాదు.

దీనికి కారణాలను లోతుగా విశ్లేషించిన ఒకరిద్దరు వ్యాపారులు... ప్రత్యేకంగా ఎండాకాలంలో గుంటూరు, తెనాలి వంటి ప్రాంతాలకు వెళ్ళి, అక్కడి మహిళల సహకారంతో అక్కడే శుచి, శుభ్రతలతో వారి చేత పచ్చళ్ళు పెట్టించి(కొద్ది మొత్తాల్లోనే) జాడీలతో తెచ్చి హైదరాబాద్ లోని ఒకటి రెండు చోట్ల అమ్ముతుండేవాళ్ళు. ఇది ఆదరణకు నోచుకున్నది (జయా ఫుడ్స్/పికిల్స్ వంటివి).

ఔత్సాహిక వ్యాపారి  అయిన ఒక తెలుగు న్యాయమూర్తి కుమారుడు ఈ వ్యాపారంపట్ల కుతూహలం కనబరిచాడు. అయితే స్థానికంగాకంటే... అప్పటికే విదేశాల్లో గణనీయంగా పెరుగుతున్న భారతీయులకు సంప్రదాయ రుచులు అందించడానికి ‘స్పెన్సర్’ కంపెనీ పచ్చళ్ళ ఎగుమతి వ్యాపారంలోకి దిగింది. అయితే దాని పచ్చళ్ళలో ఆంధ్రా స్పెషల్స్ ఉండేవి కావు. అందువల్ల ఈ ఔత్సాహిక వ్యాపారి వారి వెనుకే పోతూ ఎగుమతులకు ప్రయత్నిస్తున్న రోజుల్లో...

పచ్చళ్ళ ఎగుమతులమీద కన్నేసి ‘ప్రియా ఫుడ్స్’  రంగప్రవేశం చేసింది. రామోజీరావు అండ్ టీమ్ ఏది చేసినా దానిలో చాలా విశిష్ఠతలు ఉండేటట్లు చూడడం వారి ప్రత్యేకత. స్వచ్ఛత, శుభ్రతల కోసం .. పాలరాతి వంటశాలలు (లాబ్స్ అనేవారు..అప్పటికి ఇటువంటి ఏర్పాటు కొత్త), రేటు గిట్టుబాటు కావడానికి కారం, పసుపు వంటివి బయట కొనకుండా స్వంతంగా తయారు చేసుకోవడం(వారి అవసరాలకు పోను, మిగిలినది ప్రియా బ్రాండ్ పేరుమీదే విడిగా అమ్ముకోవడం), ఊరగాయలకు అవసరమైన మామిడి తదితర కాయలు కూడా స్వంత తోటల(లేదా కౌలు ఏర్పాటుతో) నుండి సేకరించడంవంటి ఏర్పాట్లు ఘనంగా చేసి... మొత్తానికి ప్రాడక్ట్ బయటికి తెచ్చారు. స్వంతంగా ఉన్న పబ్లిసిటీ సంస్థలు, స్వంత మీడియాను(ఈనాడు, సితార, చతుర, విపుల) గరిష్ఠంగా ఉపయోగించుకుంటే అమ్మకాలకు తిరుగుండదనే మొండి ధైర్యం.....

అనుకున్నదొకటి, అయిందొకటి... అన్నట్లు.. ప్రియాఫుడ్స్ మార్కెట్ లోకి ప్రవేశించినా, ప్రచారం ఆర్భాటంగా హోరెత్తించినా ముఖ్యంగా ప్రవాసాంధ్రులకోసం ఎగుమతులకు ప్రాధాన్యం ఇచ్చి ఆ దిశగా కదిలినా. .. అప్పటికే స్పెన్సర్ వంటి కంపెనీలు క్యూలో నిలబడి కళ్ళు తేలేయడం చూసి ఖంగుతిన్నారు. దానిమీద భారీగా పెట్టిన పెట్టుబడులు, శ్రమ.. దిక్కు తోచని స్థితి.

అయినా ఓటమిని లేదా వైఫల్యాన్ని ఒకపట్టాన అంగీకరించడానికి ఇష్టపడని రామోజీ బృందం ... పబ్లిసిటీతో స్పీడు పెంచి స్ధానిక జనాలకు దగ్గర కావడానికి ఒక కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నది. ఇన్ స్టంట్ స్పందన.. క్షణాల్లో జనాలను ఆకర్షించడానికి షార్ట్ కట్ రూట్ –సినిమా గ్లామర్. ఎలాగూ ‘సితార’ చేతిలో ఉంది. ఇతర సినిమా పత్రికలంత అమ్మకాలు దీనికి ఎప్పుడూ ఉండేవి కావు. పైగా (కాస్తంత పొగరుగా ఉండే) డైలీ పేపర్ జర్నలిజం,  కొద్దిగా వంగమంటే ఏకంగా సాష్టాంగపడే సినిమా జర్నలిజం ..రెండూ భిన్న ధృవాలు. కానీ సితార కూడా ఈనాడు పొగరును పుణికి పుచ్చుకుని నడుస్తుండడంతో తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం దానిని అక్కున చేర్చుకోలేదు... కొంత దూరంలోనే ఉంచింది. కానీ ‘కింగ్ మేకర్’ మైండ్ సెట్ తో ఉండే రామోజీ బృందం సితారను అడ్డుపెట్టుకుని సినిమా గ్లామర్ ను ఉపయోగించుకోవడానికి కొత్త వ్యూహాన్ని అమల్లో పెట్టింది.

నీరాజనం.....

అప్పట్లో ‘ఆకాశవాణి’లో ‘నీరాజనం’ అని ఒక ప్రాయోజిత కార్యక్రమం వారంలో ఓ అరగంటపాటూ రాత్రి 9.30 గంటలకు(సమయం సరిగా గుర్తు లేదు) ప్రసారమయ్యేది. దానిని ప్రముఖులు సమర్పించేవారు. మధ్యలో తాజా సినిమా హిట్ సాంగ్స్ ఉండేవి. ఇది బాగా పాపులర్ అయింది. కిరణ్ యాడ్స్ దీనిని చాలా వారాలపాటు ముందుగానే బుక్ చేసుకున్నది. రామోజీ టీమ్ ఎంపిక చేసిన  ప్రముఖుల వద్దకు...  సితార విలేకరులు స్వయంగా వెళ్ళి, వారి డీల్ ను వివరించేవారు... ‘‘ఈ కార్యక్రమాన్ని మీరు సమర్పించాలనేది మా బాస్ అభీష్ఠం.  మీరు దీనిని సమర్పిస్తే ప్రతిఫలంగా సితార కవర్ పేజీ మీద ఫొటో, లోపల మీ ఇంటర్వ్యూలు, ఫొటోలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి ప్రచురిస్తుంటాం....’’ అని చెప్పేవారు.  పవర్ ఫుల్ మీడియా(ఈనాడు).. అదీగాక సినిమా పత్రికలో పబ్లిసిటీ అంటున్నారు... అవి ఉన్నా లేకపోయినా, ఈ డీల్ ఒప్పుకోకపోతే...వారు పగ పడతారేమోనన్న భయం కొద్దీ.. దాదాపు అందరూ ఒప్పుకునేవారు. టాప్ లో ఉన్న కొంత మంది  సినీ తారలు మాత్రం లెక్కలు వేసి చూసుకుని ...గిట్టుబాటు కాదనుకున్నప్పుడు  ముఖాన్నే ‘నో’అని చెప్పి మీడియా వారితో లేనిపోని గొడవలు కొని తెచ్చుకోవడం ఎందుకని... ఏవో కారణాలు చెప్పి లౌక్యంగా తప్పుకునేవారు. 

ఇదీ నేపథ్యం... ఇక ఆ తరువాత...

ఇలాంటి సమయంలో ఒకనాడు మద్రాస్ లో ఉన్న సితార బృందం...బాలసుబ్రహ్మణ్యం గారి అపాయింట్ మెంట్ అడిగారు. అప్పుడు ... రోజుకు ఆరేడుపాటల రికార్డింగులతో జోరుమీదున్న ఆయన కొంత వెసులుబాటు చేసుకుని వీరికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. .. ఇంటిదగ్గర కలవడానికి.

వారు వస్తూనే ఐదారు రకాల ప్రియ పచ్చళ్ళు ప్యాక్ చేసి ఉన్న కార్టన్లను తెచ్చి ఆయనకు అందచేసారు. ఇతర ప్రముఖులకు చెప్పినట్లుగానే ..మా బాస్ మీ పాటల అభిమాని. మిమ్మల్ని స్వయంగా కలిసి ఇవి ఇమ్మనమని పంపారు... అంటూ డీల్ చెప్పారు. అసలు నీరాజనం పాపులర్ అవుతున్నదే లేటెస్ట్ హిట్ సాంగ్స్ తో.. అందునా బాలసుబ్రహ్మణ్యమే వాటిని సమర్పిస్తే.. ఇంకేం.. సూపర్ డూపర్ హిట్... ఆ ప్రోగ్రాం మాత్రమే కాదు, ప్రియా పచ్చళ్ళ అమ్మకాలు కూడా ఆకాశమార్గం పడతాయి. .. ఇలాటి భావనామృతంలో తేలియాడుతున్న రామోజీ బృందానికి పరోక్షంగానూ, వచ్చి స్వయంగా కలిసిన సితార బృందానికి ప్రత్యక్షంగానూ దిమ్మతిరిగే షాకిచ్చారు... తియ్యటి మాటలతో పైకి చాలా సౌమ్యంగా, ఆత్మీయంగా కనిపించే ఆ నేపథ్య గాయకుడు.

ఆయన మాటల్లోనే చెప్పాలంటే...

‘‘చూడు బ్రదర్ ! నాకు ఆ రామోజీరావు గారు ఎవరో తెలియదు. పరిచయం లేదు. ఈనాడు, సితారల గురించి వింటున్నా..నేను ఇంటికి హిందూ పత్రిక వేయించుకుంటా.. అది చదవడానికే సమయం దొరక్క ఎప్పుడో ఒకసారి చదువుతుంటా వీలు చిక్కినప్పుడు(ఎక్కువగా వాష్ రూములో). మీ పత్రికలు అక్కడక్కడా చూస్తున్నా. ఇక మీరు చెప్పిన దానిని బట్టి... నాకు రెండు విషయాలు అర్థమయ్యాయి.

ఒకటి – మీరు నాకు కవరేజి ఇస్తాననడం, నాఫొటోలు వేస్తాననడం. సరే.. మీ పాఠకులకు అవి అవసరమనుకుంటేనే వేయండి. వద్దనుకుంటే వేయకండి. మీడియాలో నాకు మిత్రులు చాలా మంది ఉన్నా... నా ఫొటోలు, నా వార్తలు వేయమని ఇప్పటివరకు నేను ఎవరినీ అడగలేదు. అలా అడిగి వేయించుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందువల్ల ...అవి వేయాలా వద్దా... అనేది మీరు, మీ సిబ్బంది, మీ యాజమాన్యం నిర్ణయించుకోవలసిన విషయం.

ఇకపోతే... నీరాజనం కార్యక్రమం నేను సమర్పించాలన్నారు. అది వాణిజ్య కార్యక్రమం. ఒక ఉత్పత్తి అమ్మకాలు పెంచుకోవడానికి మీరు చేసుకుంటున్న పబ్లిసిటీ. మీ బ్రాండ్ విలువ పెంచుకోవడానికి చేసుకుంటున్న ప్రయత్నం. మంచిదే. మంచి వ్యాపార వ్యూహమే. అయితే నేను సినిమారంగంలో చేస్తున్నది కూడా వ్యాపారమే. పాటలు ఉచితంగా పాడడం లేదు. కచ్చేరీలు కూడా ఉచితంగా చేయడం లేదు. డబ్బులు తీసుకుని పాడుతున్నా. నాది కూడా వ్యాపారమే. ఇటువంటి  కార్యక్రమాలకు నేను బ్రాండ్ అంబాసిడర్ గా లేదా యాంకర్ గా లేదా ప్రజెంటర్ గా  ఉండాలంటే... దానికి నా టర్మ్స్  నాకున్నాయి. అవి మా పిఏ ను అడిగితే వివరిస్తాడు. మీరు చేసేది, నేను చేసేది వ్యాపారమే అయినప్పుడు మనం వ్యాపార భాషలోనే మాట్లాడుకుంటే బాగుంటుందేమో’ అని ముగించాడు.

ముఖాలు పాలిపోయాయి. బాస్ కు ఏమని చెప్పాలి ? ఎలా చెప్పాలి ? ఈ ఆందోళనతో గేటు దాటుతున్న వారిని బాలసుబ్రహ్మణ్యం వెనక్కి పిలిచి...‘‘మీ కార్టన్లు ఇక్కడే మర్చిపోయి పోతున్నారు. తీసుకెళ్ళండి. మాకు ఇంటి పచ్చళ్ళు ఉన్నాయి. అవి సరిపోతాయి. ప్లీజ్.. మరోలా అనుకోవద్దు... క్షమించండి’’

ఇంకేమనాలో తెలియక వాటిని కూడా వెనక్కి మోసుకెళ్ళిపోయింది ఆ బృందం.

ఇది జరిగిన నెలా రెండునెలల లోపే నేను మద్రాస్ కు వెళ్ళడం.. అది కూడా నేను ‘ఈనాడు’లో పనిచేస్తున్నానని చెప్పడంతో నిజంగానే అప్పటివరకు రామోజీరావు గురించి తెలియని బాలసుబ్రహ్మణ్యానికి – ప్రియా పచ్చళ్ళ డీల్ దరిమిలా ఏర్పడిన కుతూహలం ఆపుకోలేక...  నేను సాధికారికంగా, ఉన్న వాస్తవాలను చెప్పగలనన్న నమ్మకంతో నన్నడిగిన ప్రశ్న...

‘‘ఎవడ్రా ఈ రామోజీ రావ్ ! నాకు ఇంటికి పచ్చళ్ళు పంపిస్తానంటాడు. నీరాజనం చేయాల్ట..  దానికి నా ఫొటోలు, ఇంటర్వ్యూలు, వాళ్ళ పత్రికల్లో ప్రామినెంట్ గా వేస్తారట..’ అని

....

కొసమెరుపు : కాలం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ‘పాడుతా తీయగా’ సీరీస్ మొదటి విడత బ్రేక్ (సుమన్ హయాంలో) వచ్చే వరకూ – కమర్షియల్  టర్మ్స్ లోనే ఉన్నారు వారిద్దరూ. ఆ తరువాత బాలసుబ్రహ్మణ్యం వెంటనే జెమినీ ఛానల్ లో ఎందరో మహానుభావులు(13 ఎపిసోడ్స్), ఆ వెనువెంటనే మాటివిలో ‘పాడాలని ఉంది’ సీరీస్ కు(దాదాపు నాలుగైదేళ్ళు నడిచింది) ఒప్పుకున్నప్పుడు.. రామోజీ రావు బృందం అభ్యంతరం లేవదీసింది.. నిర్మొహమాటంగానే (కొంత కటువుగానే) మాటలు పేలాయి. అప్పుడు కూడా కమర్షియల్ టర్మ్స్ లోనే... అయినా తగ్గని బాలసుబ్రహ్మణ్యం ఇతర  ఛానల్సులో తన ప్రోగ్రాములను  కంటిన్యూ చేసారు.... ఆ తరువాత (సంధి ఎక్కడో కుదిరి....  ఇద్దరికీ ఒకరి అవసరం మరొకరికి బాగా ఎక్కువయిన నేపథ్యంలో) మళ్ళీ ‘ఈనాడు’ లో పాడుతా తీయగా  సీరీస్ మొదలయింది. నిర్విరామంగా నడుస్తున్నది.. పాపులారిటీ రేటింగ్ లు పెంచుతూ.... అలా రోజులు గడుస్తున్న క్రమంలో...

ఒక వేడుకలో రామోజీరావుకు  బాలసుబ్రహ్మణ్యం అకస్మాత్తుగా పాదాభివందనం (అంత భారీ శరీరంతో కూడా సాష్టాంగ దండ ప్రమాణం /అష్టాంగ నమస్కారం) చేయడాన్ని టివీలో చూసి అవాక్కయ్యా ....అప్పుడు తెరుచుకున్న నోరు ఇప్పటికీ మూతపడలేదు.

-చినవ్యాసుడు, మాఊరు.

...........................


మునుగోడు ఓటర్నన్నా ! ! !

 


మునుగోడు ఓటర్నన్నా ! ! !

 

నేను

మునుగోడు ఓటర్నన్నా

ఆ సోయి ఉందన్నా

ఫికర్ చేయొద్దన్నా...

 

నెత్తురు ఇంకా వేడిగానే ఉంది

ఊపిరి సాఫీగానే ఉంది

నాడులు చురుగ్గానే ఉన్నాయ్

 

అవి కన్ఫర్మ్ చేసుకొన్నాకే

నాకు ఓటిచ్చారన్నా...

 

నాకు, నా ఊరికి, నా దేశానికి

రక్షణ కవచం నా ఓటు

ఓటుదొంగల ఆటకట్టుకు

నా వేలుతో సంధించే నాగాస్త్రం నా ఓటు

నా తలరాతను దిద్దే జాతక చక్రం నా ఓటు

నా ఆత్మ గౌరవం

నా ఇంటి దీపం నా ఓటు

...అని తెలుసన్నా

 

నన్ను టచ్ చేయగలరు

నా గుండెను టచ్ చేయలేరు

నన్ను టచ్ చేయగలరు

నా ఓటును టచ్ చేయలేరు

...అనీ తెలుసన్నా

 

కన్నుగీటుకు, నోటుకు

పడిపోయే సరుకు కాదిది

మందులు, బిర్యానీలు

నా నెత్తుటికెక్కవు

నా గుండెను చేరవు

మధ్యలోనే

మలమూత్రాల్లో రాలిపోతాయి

...అని తెలుసుకోండన్నా

 

నా  మది ...అది

అమ్మాఅయ్యలు నలిచిన  ఒత్తి

ఊరు చమురు పోసింది

దేశం వెలిగించింది

 

 

నా బొడ్డుతాడుమీద

ఒట్టేసి చెబుతున్నా

అమ్మనుగాక అమ్మనన్నా

మీ అందరికీ  మాటిస్తున్నా

నన్ను, నా ఊరిని

చుట్టిముట్టిన

దయ్యాలను, భూతాలను

తరిమికొట్టడానికి

నా ఓటు నా నుదుటిన

పెట్టిన నెత్తుటి బొట్టు

అది చెరగదు, మైలపడదు

 

ఫికర్ చేయొద్దన్నా

కసికొద్దీ వేస్తాన్నా

నాసత్తా 3న చూపుతాన్నా

 

-        చినవ్యాసుడు, మాఊరు

.......................................


 

 

నా పబ్లిక్-నా రిపబ్లిక్

 


నా పబ్లిక్-నా రిపబ్లిక్

 

 

రిపబ్లిక్ డే నాడు చెబుతున్నా

పబ్లిగ్గా...భేషుగ్గా...

 

ఇది నా రాజ్యం...

ఇక్కడ రాజ్యాంగమే నా రక్షణ కవచం

రాజులుండరు, బంట్లుండరు

రాజ్యాంగం ఎవడి జాగీరూ కాదు

అందరూ కౌలుదార్లే,  అందరూ చౌకీదార్లే

 

జెండా ఎగరేసి చెబుతున్నా

సహజీవనంలో

స్వేచ్ఛ నీ మోచేతికింది నీరు కాదు

రాజ్యాంగం పీల్చి వదిలే గాలులే

ఇక్కడ నా జెండాకు స్వేచ్ఛావాయువులు

  

జన్మతః నేను హిందువును

గర్వపడుతున్నా...

నన్ను చూసి నా మతమే కాదు

నా భారతీయత  గర్వపడాలి...

 

జన్మతః నేను ముసల్మానును

గర్వపడుతున్నా...

నన్ను చూసి నా మతమే కాదు

నా దేశప్రజలు  గర్వపడాలి...

  

జన్మతః నేను క్రిస్టియన్ ను

గర్వపడుతున్నా

నన్ను చూసి నా మతమే కాదు

నా  దేశ పతాకం  గర్వపడాలి...

 

జన్మతః నేను భారతీయుణ్ణి

గర్వపడుతున్నా...

నా భారతీయత ఇక

ఎవరెస్టంత ఎదగాలి...

ప్రపంచమంతటా వెలగాలి

  

భక్తి...

ఈ దేశానికి దాంతో సంబంధం లేదు

అది నీకూ నీ దేముడికీ మధ్య డీల్

  

కులం...

నా రాజ్యానికి దాంతో సంబంధం లేదు

అది నీకూ నీ సమాజానికి మధ్య డీల్

 

మతం

నా రాజ్యాంగానికి దాంతో సంబంధం లేదు

అది నీకూ నీ వర్గానికీ మధ్య డీల్

  

రిపబ్లిక్ డే నాడు చెబుతున్నా

పబ్లిగ్గా...భేషుగ్గా...

ఇదే నా మతం, నా ప్రజల అభిమతం

ఇదే నా దేశం, ఇదే నా పతాకం

జన్మజన్మల బంధం

ఇదే నా భారతీయం

  

- చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com

 

(ఆంధ్రజ్యోతి 26.1.2022)



నా దేవుడు


నా దేవుడు

 

 

నా దేవుడికి కులం ఉంది, బలం ఉంది

గోత్రం ఉంది, శాస్త్రం ఉంది

మతం ఉంది, గతం ఉంది

ఆస్తిఉంది, అంతస్తూ ఉంది 

బ్యాంకుల్లో ఖాతా ఉంది

 

ఆటా ఉంది పాటా ఉంది

ఊరేగడానికి వెహికలుంది

ఊగడానికో ఉయ్యాలుంది

 

కుళ్లు ఉంది, కుతంత్రం ఉంది

ద్వేషం ఉంది, రాజకీయం ఉంది

ప్రాంతం ఉంది, రాష్ట్రం ఉంది

వేషం ఉంది, రిజర్వేషన్ ఉంది

 

చలి ఉంది, గిలి ఉంది

కామం ఉంది,  కోరిక ఉంది

జెండా ఉంది, జెండర్ ఉంది

 

అందుకే వీడు నా దేవుడయ్యాడు

నేను తినేదే వాడు తింటాడు

డబ్బయినా, గడ్డయినా

ప్యూర్ వెజ్జయినా, నాన్వెజ్జయినా

 

ఇవేవీ లేనివాడు

దేవుడెట్లయితడు

అందుకే వాడు నా ఇష్టదైవం

నా కుల దైవం, నా గుల దైవం

 

 

-   చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

…………….

నిత్యనూతన భ్రాంతి

  మా తాతకు...  పుట్టిపెరిగిన ఊరు కైలాసానికి కోసుదూరం పిల్లల కాలానికి అది కరతుమ్మలు , జిల్లేళ్ళమయం   మా నాన్నకు...  పుట్టిపెరిగిన ఊరు వైకుంఠా...