ఆలిండియా రేడియోనా ...ఆకాశవాణా...!!!!


 

 తెలుగు-2...పట్టించుకోకపోతే పర్వతాలే కరిగిపోతాయి

 

తెలుగు..గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం’  అన్న శీర్షికన  జులై 20న నా బ్లాగులో ప్రచురించిన వ్యాసానికి అందిన స్పందన చాలా ప్రోత్సాహాన్నిచ్చింది. పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు నాతో ఏకీభవిస్తూ కొన్ని సూచనలు, సలహాలు కూడా చేసారు. వారందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు. అదే సమయంలో .. హెడ్డింగ్ ఘాటుగా ఉండడంతో కొరపోయి.. వ్యాసం లోపలికి కూడా తొంగి చూడకుండా బాధతో, నిరాశతో మెలికలు తిరిగిపోయిన సున్నిత మనస్కులు అయిన వీర భాషాభిమానులు కూడా తారసపడ్డారు. ఇలాంటివారు ముగ్గురు నలుగురే అయినా అలా బాధపడి స్పందించకుండా ఉండిపోయినవారు ఇంకా కొందరు ఉండవచ్చనే అనుమానం కొద్దీ ఈ వివరణ ఇస్తున్నా...

 
కాగితపు పడవలు, కొయ్యగుర్రాలు...


ఇప్పటికిప్పుడు కానీ, సమీప భవిష్యత్తులోకానీ తెలుగు భాషకు వచ్చిన ప్రమాదమేదీ లేదు. ఇంటాబయటా దాదాపు 15 కోట్ల మంది తెలుగు వారు ప్రతి రోజూ  ప్రతి క్షణం నోరారా తెలుగును హాయిగా మాట్లాడుకుంటున్నప్పుడు తక్షణం ముంచుకొచ్చిన ఉపద్రవం ఏదీ లేదు. నిండు గోదావరిలా సజీవంగా ప్రస్తుతానికి ప్రవహిస్తూనే ఉంది. ఇంకా కొంతకాలం కూడా కచ్చితంగా ప్రవహిస్తుంది. అయితే గుర్తించాల్సింది ఏమిటంటే... ఎంతటి మహానది అయినా, మహా పర్వతం అయినా పట్టించుకోకపోతే ఏదో ఒకనాటికి కనుమరుగయిపోతుంది-అని. ఇది చరిత్ర చెపుతున్న సత్యం. ఎప్పటిలాగే కాలం మారుతున్నా....  జీవన శైలి మాత్రం మునుపటిలాగా మందకొడిగా సాగడం లేదు. పెను మార్పులు అతి తక్కువ సమయంలో చోటు చేసుకోవడాన్ని కళ్ళారా చూస్తూనే ఉన్నాం.

 

కుల, మత, ప్రాంత, వర్గ వైషమ్యాలతో, స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో  ఎవడి గొడ్డలి వాడు తీసుకుని వాడు కూర్చున్న కొమ్మను కాపాడుకోవడానికి మిగతా కొమ్మలను నరికేసుకుపోతుంటే...  కొంత కాలానికి ఆ చెట్టు పరిస్థితి ఏమవుతుందో చెప్పడానికి కొంత కటువుగా ఆ వ్యాసంలో హెచ్చరించాల్సి వచ్చింది, ఆ క్రమంలోనిదే  ఆ శీర్షిక కూడా...

 

కాలక్షేపానికో, ప్రచారానికో, గుర్తింపుకో ‘తెలుగు భాష’ను గురించి ఆవేదనతోనో, ఆవేశంతోనో, ఆక్రోశించో నాలుగు మాటలు  జనాల్లోకి వదులుతుంటే అవి కాగితపు పడవల్లా కాసేపు మురిపిస్తాయి. ముద్దుముద్దు మాటలతోనో,  మీసాలు మెలేయడంతోనో భాష బాగుపడదు. దానికి ఎదురయ్యే ప్రమాదాలు తొలగిపోవు.

 

ఎవడో వచ్చి ఏదో చేయాలనో, ప్రభుత్వాలు వాటంతట అవి,  రాజకీయ నాయకులు వారంతట వారు పూనుకుని ఎర్ర తివాచీలు అడుగడుగునా పరుస్తూ పోవాలనో కోరుకుంటున్నంతకాలం  ప్రయాణం  ‘కొయ్య గుర్రం’ మీద స్వారీలా ఉంటుంది...పైన ఎక్కినవాడు మాత్రం ఫుల్ జోష్ తో ఊగిపోతుంటాడు.

 

భాషపట్ల అభిమానం కానీ, ప్రమాదం ముంచుకొచ్చినప్పడు చూపాల్సిన తెగువ కానీ, అభివృద్ధి పట్ల ఆకాంక్షగానీ ఎలా ఉండాలో చెప్పడానికి ఒక అద్భుత ఉదాహరణ....

 


బాబుల్ గాడి దెబ్బంటే.. గోల్కొండ అబ్బా...అనాలి

 

అది 1970 వ దశకం. అప్పట్లో ‘రేడియో’ ప్రధాన సమాచార ప్రసార సాధనం. వార్తలు, ఇతర కార్యక్రమాలను ప్రసారం చేసే వ్యవస్థ-ఆలిండియా రేడియో...ఆకాశవాణి. జాతీయ వార్తలు కానీ, ప్రాంతీయ వార్తలు కానీ పొద్దస్తమానం ఉండేవి కావు. వాటి నిర్ణీత వేళల్లో అవి ప్రసారమయ్యేవి. వాటిలో కూడా దేశవ్యాప్తంగా అందరూ ఎక్కువగా చూసేది...రాత్రి 9గంటలకు ఆంగ్లంలో ప్రసారమయ్యే వార్తలు.. అప్పుడు దేశ ప్రధాని ఇందిరాగాంథీ....ఇదీ నేపథ్యం.

 

ఆ రోజు.. రాత్రి కచ్చితంగా 9 గంటలకు...ఎప్పటిలాగే ప్రారంభవాక్యం-This is All India Radio giving you the news..అని అప్పటివరకు సంవత్సరాలుగా వినడానికి అలవాటుపడిన శ్రోతలకు...ఒక మైల్డ్ షాక్...ఓ ఝలక్...This is Akashvani giving you the newsఅని వినపడింది.  దేశమంతా కొద్దిక్షణాల్లోనే తేరుకుని ముసిముసిగా నవ్వుకుంటూ వార్తల్లోకి చెవులు దూర్చారు...ఒక్క మద్రాసు రాష్ట్రంలో (ప్రస్తుత తమిళనాడు) తప్ప....ఆ క్షణంలో అక్కడ రాజుకున్న చిచ్చు తెల్లవారేటప్పటికి దావానలమయింది, మిన్నూమన్నూ ఏకమయ్యాయి. రాష్ట్ర  (భాషా) ప్రయోజనాలకోసం ప్రభుత్వం, ప్రతిపక్షం అన్న తేడా అక్కడ మాత్రం ఉండదు కాక ఉండదు.  అందరిదీ ఒకే గొంతు. ర్యాలీలు, సభలు, ఢిల్లీకి టెలిగ్రాములు, ఫోన్లు, పోస్ట్ కార్డులు...దీక్షలు..హోరెత్తుతున్నాయి. ..ఎంతగా అంటే పక్కనే ఉన్న సముద్రఘోష కూడా వినపడనంతగా......

 

ఆ రాత్రి... మళ్ళీ 9 గంటలకు వార్తలు ...మద్రాసులో అకస్మాత్తుగా  ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో అర్ధంకాక ... తెలుసుకోవడానికి దేశమంతా వాటికోసం ఎదురు చూస్తున్నది.... 8.58.. 8.59... 9.00.. సిగ్నేచర్ ట్యూన్... This is All India Radio  giving you the news  … అని వినపడింది. అంతే మళ్ళీ దేశం  షాక్స్.. మద్రాస్ రాక్స్... అన్నట్లు .. మిన్నంటిన మంటలు ఆనందబాష్పాలై తమిళులను జల్లులతో తడిపేసాయి.  

 

ఒక్కసారి డిసైడ్ అయిపోతే నా మాట నేనే వినను.. అనే టైపు... రాక్షసి, ఐరన్ లేడీ,  ఓన్లీ మ్యాన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్... వంటి పలు బిరుదులు తగిలించుకున్న శ్రీమతి ఇందిరా గాంధీ .. 24 గంటల్లోనే  నిర్ణయాన్ని వాపసు తీసేసుకున్నారు. కాదు..తీసుకోక తప్పని పరిస్థితి..  కారణం ఆమెకు తెలుసు ... తమిళుల హిందీ వ్యతిరేకత, తమిళుల సంకల్పబలం ఎంత గట్టిగా ఉంటుందో...   హిందీ వ్యతిరేక ఉద్యమం మంటలు చల్లారినా, పౌరుషాల సెగలు మాత్రం బుసలు కొడుతూనే ఉంటాయి అక్కడ.

 

(ఇక్కడ ఆకాశవాణిలో పేరు మార్పుకు దేశ ప్రధానికి సంబంధం ఏమిటన్న సందేహం రావచ్చు. ఆ మార్పు ఆమె జోక్యంతోనే జరిగింది..ఆకాశవాణి అనేది వ్యవస్థ పేరు...దానికి మళ్ళీ  అనువాదమేమిటి.. నాన్సెన్స్... ఏ భాషలో చెప్పినా... ఎక్కడ చెప్పినా అది ఆకాశవాణే..అనేది ఆమె వాదన అయి ఉంటుంది. తరువాత ఉపసంహరణ కూడా ఆమెదే)


-      చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

 

 

గమనిక :  తెలుగు భాషను ఎలా కాపాడుకోవాలి, ఎలా సుసంపన్నం చేసుకోవాలి...అన్న విషయంపై మరిన్ని వ్యాసాలు త్వరలో ...

అలాగే మీరు కూడా మీ అభిప్రాయాలను, మీ సూచనలను, ఇదే బ్లాగులో వ్యాఖ్యల బాక్స్ లో నమోదు  చేస్తే... భాషాభిమానుల, సాహిత్యాభిమానుల స్పందన అంతా ఒక్కచోటే చూసుకునే అవకాశం అందరికీ కలుగుతుంది. మీ వ్యాఖ్యతోపాటూ, మీ ఇ-మెయిల్, అభ్యంతరం లేకపోతే ఫోన్ నంబరు జత చేయవచ్చు, తప్పనిసరి కాదు

తెలుగు భాషాభిమానులు అందరికీ షేర్ చేయండి

.................


తెలుగు... గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం ! ! !


 

తెలుగు... గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం ! ! !

 

తెలుగును బతికించుకుందాం’.. ‘మన తెలుగును కాపాడుకుందాం’... అంటూ అత్యున్నత పదవులలోని, అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తుల నుండి సాధారణ తెలుగు అభిమాని వరకు చేస్తున్న ప్రకటనలను దశాబ్దాలుగా విసుగూ విరామం లేకుండా వింటునే ఉన్నాం. రెండో చెవినుండి క్షణం ఆలస్యం చేయకుండా వదిలేస్తూనూ ఉన్నాం. పనిలో పనిగా టైం దొరికినప్పుడు  ప్రభుత్వాలను చెరిగేస్తున్నాం, నిప్పులతో కడిగేస్తున్నాం. భాషాభిమానం ఉండి మాతృదేశానికి దూరంగా బతుకుతున్నవారు...ఆర్థికంగా కాస్తంత నిలదొక్కుకున్న తరువాత తమ పిల్లలకు తెలుగు-పేగుబంధం తెగిపోతున్నదన్న ఆవేదనతో నిజాయితీగా వారి స్థాయిలో వారు మాత్రం ఉడతా భక్తి ప్రదర్శిస్తున్నారు, మాటలలో కాదు చేతలలో.

 

 

ఆ ఉడత ఊపులు ఇక్కడ పాతుకుపోయిన వృక్షాల కొమ్మలనే కాదు, రెమ్మలను కూడా ఏ మాత్రం కదిలించలేకపోతున్నాయి.  అంతటితో ఆ మాన్లు సరిపెట్టుకుంటే సంతోషమే. ఏ రెండు రెమ్మలు కలిసినా నీ తెలుగు వేరు, నా తెలుగు వేరు... నీ జిల్లా వేరు, నా జిల్లా వేరు...నీ రాష్ట్రం వేరు, నా రాష్ట్రం వేరు...నీ సంస్కృతి వేరు, నా సంస్కృతి వేరు... అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఎక్కడిదాకా తీసుకెళ్ళాయంటే...నీ తల్లి వేరు, నా తల్లి వేరు... ... ఇంతగా తల్లివేరుకు తెగులు ముదిరిన తరువాత, తెలుగు వృక్ష ఆత్మ క్షోభించకుండా ఉంటుందా ? సజీవ సమాధికి సిద్దం కాకుండా ఉంటుందా ?

 

 

అసలు సిసలు ఉద్యమకారుడయిన ఓ మహానుభావుడి నోటినుండి అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా (ఓరీ తెలుగువాడా..అని అంతే తప్ప ఆంధ్రోడు కాదు) చావవెందుకురా...అన్న పదాలు ఊడిపడినా... ‘‘ఆంధ్ర’’ పదం మాత్రం ఉద్యమ సేనలకు, సేనానులకు అంటరానిది అయిపోయింది, ఓ పచ్చి బూతయిపోయింది. పోతన మా వాడేఅని చంకలో ఇరికించుకున్నప్పటి సంబంరం... ఆయన రాసిన శ్రీమదాంధ్ర మహాభాగవతంతాలూకు ప్రస్తావనల్లో కూడా ఆంధ్రశబ్దాన్ని పలకడంలో మాయమయి పైగా అపచారంగా భావిస్తున్నారు. ఉచ్చరిస్తే నోటిని ఫినాయిలు వేసి కడుక్కోవాలన్నంత స్థాయిలో దూరం పెట్టేస్తున్నారు.

 

 

ఒక మతం వారికి తీన్ తేరా ఆఠ్ అఠారా (3,13,8,18 అంకెలు) నిషిద్ధాలు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండుఅంకె పాపం చేసుకుంది. ఆ రెండుపత్రికలు, రెండుజిల్లాలు, రెండువేళ్ళు...కనకూడనివి, వినకూడనివి. ముఖ్యంగా   రెండు జిల్లాల భాషనుఅందరూ మోయడమేమిటి ? అని రాగాలు తీసేవాళ్లు, ఇప్పుడు తమ ప్రాంత తెలుగే అచ్చ తెలుగు..అని మురిసిపోతూ... వారికి కూడా తెలియకుండానే వారి ప్రాబల్యం ఉన్న  రెండు జిల్లాల తెలుగుకే చీరెసారె పెట్టి  తన్మయత్వంతో మెలికలు తిరిగి పోతున్నారు. ఇక మీదట రెండు రాష్ట్రాలవారు- వారికున్న 46 జిల్లాల్లో...జిల్లాకో, పట్టణానికో ఒక దుకాణం తెరిచి ఎవడి తల్లి వాడిదే,  ఎవడి నాలుక వాడిదే, ఎవడి భాష వాడిదే, ఎవడి సంస్కృతి వాడిదే .... అని మొగసాలకెక్కే రోజులు ఎక్కువ దూరంలో లేవనిపిస్తుంది.

 

 

రెండు రాష్ట్రాలుగా విడిపోయింది భౌగోళికంగా, రాజకీయంగానే... అని ఒకవంక అవసరార్థం ప్రకటిస్తూనే..  భాష, కళలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు కూడా విడిపోవలసిందేనని మరోవంక అడ్డ గీతలు, హద్దు గీతలు గీస్తున్నంత కాలం.. తెలుగు భాష ఇంకా చిక్కి శల్యమయిపోయి గోదాట్లో కొట్టుకుపోయి... చివరగా బంగాళాఖాతంలో కలిసిపోకుండా ఉంటుందా..?.

 

 

అలా కాకూడదు అనుకుంటే...

 

మొట్టమొదటగా ఒప్పుకోవలసింది...  కాపురాలు వేరయినా... మనం ఒకే ఒక భాషామతల్లి బిడ్డలం-అని. ఆంధ్రశబ్దాన్ని అపశబ్దజాబితానుంచి తొలగించాలి-అని. 46 జిల్లాల్లోని  ప్రతి మాండలికానికి ఇతర మాండలికాల వారు పెద్దపీట వేసి గౌరవించాలి-అని.

 

 

అందరం విధిగా గుర్తుంచుకోవలసిన అంశం భాషా ప్రయుక్త రాష్ట్రాలు: భాషల పేరుతో దేశంలో రాష్ట్రాల ఏర్పాటు జరగక ముందు భాషల మనుగడ ఎలా ఉండేదో తెలుసుకోవాలి. అధ్యయనం చేయాలి.

 

మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే......

 

తెలుగు మాట్లాడేవారితో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రం ఏర్పడక పూర్వం తెలుగు భాష పరిస్థితి ఏమిటి ? – ఏర్పడిన తరువాత  తెలుగు భాష పరిస్థితి ఏమిటి ?  అభివృద్ది చెందిందా !!! దిగజారిందా !!! ... అంటే.. ఒకే భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఉండాలని కట్టెలెగదోసి దేశమంతా చిచ్చును విజయవంతంగా రగిలించిన తెలుగు వాడు ...తీరా తెలుగు రాష్ట్రం ఏర్పడిన తరువాత ...భాషాపరంగా తెలుగుకు చేసిన మేలు ఏమిటి ? తవ్వి నెత్తికెత్తిందేమిటి ? కొత్తగా మొలిపించిన కొమ్ములేమిటి ?

 

-      చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

  

మీకు నచ్చితే తెలుగు వీరాభిమానులకు షేర్ చేయండి....కలిసి బతికించడం కష్టమని అందరం తీర్మానిస్తే , కలిసి చంపేద్దాం  తేలిగ్గా.....నొప్పి తెలియకుండా......అదీ త్వరగా....ఇంకా నానబెట్టకుండా.....



పుణ్యాయనం

 



పుణ్యాయనం

 

ఒక బాల్యం...

ఆగిపోయింది

కాలికింది రాదారి కుంగిపోయింది

ఒక యవ్వనం

కాలిపోయింది

పూతకొచ్చిన చెట్టు మోడయిపోయింది

ఒక వృద్ధాప్యం

చతికిలబడిపోయింది

చేతికర్ర జారిపోయింది

 

ఇంటింటి రామాయణం

కరోనా పుణ్యాయణం

 

 -  చినవ్యాసుడు, మాఊరు.

chinavyasudu@gmail.com

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...