తెలుగు... గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం ! ! !


 

తెలుగు... గోదాట్లో కొట్టుకుపోవడం తథ్యం ! ! !

 

తెలుగును బతికించుకుందాం’.. ‘మన తెలుగును కాపాడుకుందాం’... అంటూ అత్యున్నత పదవులలోని, అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తుల నుండి సాధారణ తెలుగు అభిమాని వరకు చేస్తున్న ప్రకటనలను దశాబ్దాలుగా విసుగూ విరామం లేకుండా వింటునే ఉన్నాం. రెండో చెవినుండి క్షణం ఆలస్యం చేయకుండా వదిలేస్తూనూ ఉన్నాం. పనిలో పనిగా టైం దొరికినప్పుడు  ప్రభుత్వాలను చెరిగేస్తున్నాం, నిప్పులతో కడిగేస్తున్నాం. భాషాభిమానం ఉండి మాతృదేశానికి దూరంగా బతుకుతున్నవారు...ఆర్థికంగా కాస్తంత నిలదొక్కుకున్న తరువాత తమ పిల్లలకు తెలుగు-పేగుబంధం తెగిపోతున్నదన్న ఆవేదనతో నిజాయితీగా వారి స్థాయిలో వారు మాత్రం ఉడతా భక్తి ప్రదర్శిస్తున్నారు, మాటలలో కాదు చేతలలో.

 

 

ఆ ఉడత ఊపులు ఇక్కడ పాతుకుపోయిన వృక్షాల కొమ్మలనే కాదు, రెమ్మలను కూడా ఏ మాత్రం కదిలించలేకపోతున్నాయి.  అంతటితో ఆ మాన్లు సరిపెట్టుకుంటే సంతోషమే. ఏ రెండు రెమ్మలు కలిసినా నీ తెలుగు వేరు, నా తెలుగు వేరు... నీ జిల్లా వేరు, నా జిల్లా వేరు...నీ రాష్ట్రం వేరు, నా రాష్ట్రం వేరు...నీ సంస్కృతి వేరు, నా సంస్కృతి వేరు... అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఎక్కడిదాకా తీసుకెళ్ళాయంటే...నీ తల్లి వేరు, నా తల్లి వేరు... ... ఇంతగా తల్లివేరుకు తెగులు ముదిరిన తరువాత, తెలుగు వృక్ష ఆత్మ క్షోభించకుండా ఉంటుందా ? సజీవ సమాధికి సిద్దం కాకుండా ఉంటుందా ?

 

 

అసలు సిసలు ఉద్యమకారుడయిన ఓ మహానుభావుడి నోటినుండి అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా (ఓరీ తెలుగువాడా..అని అంతే తప్ప ఆంధ్రోడు కాదు) చావవెందుకురా...అన్న పదాలు ఊడిపడినా... ‘‘ఆంధ్ర’’ పదం మాత్రం ఉద్యమ సేనలకు, సేనానులకు అంటరానిది అయిపోయింది, ఓ పచ్చి బూతయిపోయింది. పోతన మా వాడేఅని చంకలో ఇరికించుకున్నప్పటి సంబంరం... ఆయన రాసిన శ్రీమదాంధ్ర మహాభాగవతంతాలూకు ప్రస్తావనల్లో కూడా ఆంధ్రశబ్దాన్ని పలకడంలో మాయమయి పైగా అపచారంగా భావిస్తున్నారు. ఉచ్చరిస్తే నోటిని ఫినాయిలు వేసి కడుక్కోవాలన్నంత స్థాయిలో దూరం పెట్టేస్తున్నారు.

 

 

ఒక మతం వారికి తీన్ తేరా ఆఠ్ అఠారా (3,13,8,18 అంకెలు) నిషిద్ధాలు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండుఅంకె పాపం చేసుకుంది. ఆ రెండుపత్రికలు, రెండుజిల్లాలు, రెండువేళ్ళు...కనకూడనివి, వినకూడనివి. ముఖ్యంగా   రెండు జిల్లాల భాషనుఅందరూ మోయడమేమిటి ? అని రాగాలు తీసేవాళ్లు, ఇప్పుడు తమ ప్రాంత తెలుగే అచ్చ తెలుగు..అని మురిసిపోతూ... వారికి కూడా తెలియకుండానే వారి ప్రాబల్యం ఉన్న  రెండు జిల్లాల తెలుగుకే చీరెసారె పెట్టి  తన్మయత్వంతో మెలికలు తిరిగి పోతున్నారు. ఇక మీదట రెండు రాష్ట్రాలవారు- వారికున్న 46 జిల్లాల్లో...జిల్లాకో, పట్టణానికో ఒక దుకాణం తెరిచి ఎవడి తల్లి వాడిదే,  ఎవడి నాలుక వాడిదే, ఎవడి భాష వాడిదే, ఎవడి సంస్కృతి వాడిదే .... అని మొగసాలకెక్కే రోజులు ఎక్కువ దూరంలో లేవనిపిస్తుంది.

 

 

రెండు రాష్ట్రాలుగా విడిపోయింది భౌగోళికంగా, రాజకీయంగానే... అని ఒకవంక అవసరార్థం ప్రకటిస్తూనే..  భాష, కళలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు కూడా విడిపోవలసిందేనని మరోవంక అడ్డ గీతలు, హద్దు గీతలు గీస్తున్నంత కాలం.. తెలుగు భాష ఇంకా చిక్కి శల్యమయిపోయి గోదాట్లో కొట్టుకుపోయి... చివరగా బంగాళాఖాతంలో కలిసిపోకుండా ఉంటుందా..?.

 

 

అలా కాకూడదు అనుకుంటే...

 

మొట్టమొదటగా ఒప్పుకోవలసింది...  కాపురాలు వేరయినా... మనం ఒకే ఒక భాషామతల్లి బిడ్డలం-అని. ఆంధ్రశబ్దాన్ని అపశబ్దజాబితానుంచి తొలగించాలి-అని. 46 జిల్లాల్లోని  ప్రతి మాండలికానికి ఇతర మాండలికాల వారు పెద్దపీట వేసి గౌరవించాలి-అని.

 

 

అందరం విధిగా గుర్తుంచుకోవలసిన అంశం భాషా ప్రయుక్త రాష్ట్రాలు: భాషల పేరుతో దేశంలో రాష్ట్రాల ఏర్పాటు జరగక ముందు భాషల మనుగడ ఎలా ఉండేదో తెలుసుకోవాలి. అధ్యయనం చేయాలి.

 

మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే......

 

తెలుగు మాట్లాడేవారితో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రం ఏర్పడక పూర్వం తెలుగు భాష పరిస్థితి ఏమిటి ? – ఏర్పడిన తరువాత  తెలుగు భాష పరిస్థితి ఏమిటి ?  అభివృద్ది చెందిందా !!! దిగజారిందా !!! ... అంటే.. ఒకే భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఉండాలని కట్టెలెగదోసి దేశమంతా చిచ్చును విజయవంతంగా రగిలించిన తెలుగు వాడు ...తీరా తెలుగు రాష్ట్రం ఏర్పడిన తరువాత ...భాషాపరంగా తెలుగుకు చేసిన మేలు ఏమిటి ? తవ్వి నెత్తికెత్తిందేమిటి ? కొత్తగా మొలిపించిన కొమ్ములేమిటి ?

 

-      చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

  

మీకు నచ్చితే తెలుగు వీరాభిమానులకు షేర్ చేయండి....కలిసి బతికించడం కష్టమని అందరం తీర్మానిస్తే , కలిసి చంపేద్దాం  తేలిగ్గా.....నొప్పి తెలియకుండా......అదీ త్వరగా....ఇంకా నానబెట్టకుండా.....



పుణ్యాయనం

 



పుణ్యాయనం

 

ఒక బాల్యం...

ఆగిపోయింది

కాలికింది రాదారి కుంగిపోయింది

ఒక యవ్వనం

కాలిపోయింది

పూతకొచ్చిన చెట్టు మోడయిపోయింది

ఒక వృద్ధాప్యం

చతికిలబడిపోయింది

చేతికర్ర జారిపోయింది

 

ఇంటింటి రామాయణం

కరోనా పుణ్యాయణం

 

 -  చినవ్యాసుడు, మాఊరు.

chinavyasudu@gmail.com

రాష్ట్ర డిజిపి గారికి బహిరంగ లేఖ

 


To

The Director General Of Police.....


నమస్తే..... 

 

ü  విషయం :   మన వీథిలో, మన బస్తీలో, మన నగరంలో, మన రాష్ట్రంలో... తోపుడుబండ్లపై వాడుతున్న చిన్న మైక్ సెట్లకు సంబంధించి.....

 

చిరు వ్యాపారులకు, సామాన్య ప్రజలకు సంబంధించిన ఒక చిన్న చిక్కు సమస్య ఇది. సమస్య చిన్నదే అయినా దాని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటున్నది. మీరు మీ శాఖ స్థాయిలోనే కాక, ప్రభుత్వ స్థాయిలో కూడా చర్చించి వీలయినంత త్వరగా ఒక సానుకూల పరిష్కారం చూపగలరని ఆశిస్తున్నా....

 

*     సాంకేతికత సాయంతో మారుతున్న ఆధునిక వ్యాపార శైలిలో ఇది ఒక తాజా పరిణామం. తోపుడుబళ్ళమీద, సైకిళ్ళు, మోపెడ్లమీద కాలనీలు, బస్తీల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకునేవారు(కూరగాయలు, పండ్లు, పూలు, పాత పేపర్లు/ఇనుప సామాన్లు, కత్తులకు సాన పట్టేవాళ్లు, గ్యాసు స్టౌ రిపేర్లు, సోఫా రిపేర్లు, ముగ్గు, చీపుర్లు, బూజు కర్రలు, ప్లాస్టిక్ సామాన్లు, బొట్టుబిళ్ళలు, పిన్నీసులు, మొలతాళ్ళు, సవరాలు, కొబ్బరిబోండాలు, చిరుతిళ్ళు, అల్లం-ఎల్లిగడ్డ-ఉల్లిగడ్డలు...ఈ జాబితా అనంతం....) వీరంతా  బ్యాటరీతో పనిచేసే సౌండ్ బాక్స్ తో ఉన్న చిన్న మైక్ సెట్లను  పెద్ద శబ్దంతో ఉపయోగిస్తున్నారు. ముందుగా రికార్డ్ చేసుకున్న వాయిస్ తో వారి గొంతు  శ్రమను తగ్గించుకుంటూ, వారి వ్యాపార సందేశాన్ని వీలయినంతమందికి చేరవేస్తూ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. వీరంతా బడుగువర్గాలవారు... రోజువారీ కష్టాన్ని నమ్ముకుని, అమ్ముకుని బతికేవారు.. కాబట్టి ఆ కోణంలో అది సంతోషించదగిన పరిణామమే.

  

*     మారుతున్న కాలంలో అనివార్యంగా మారినవి మనం ఉండే ఇళ్ళు కూడా. సమాజంలోని అన్ని స్థాయిలవారం అపార్ట్ మెంట్ల జీవితాలకు అలవాటు పడిపోయాం. నాలుగు, ఐదు... ఆ పైన ఆకాశహార్మ్యాలదాకా  నిలువుగా, అడ్డంగా  ఇవి పెరిగి పోతున్నాయి.  రెండు, మూడు గదుల వసతికి అనుగుణంగానే చిన్నాపెద్దా కుటుంబాలు సర్దుకుపోతున్నాయి.

 

*     విశ్రాంతికి, నిద్రకు, ఆహారానికి, ఆహ్లాదానికి మాత్రమే ఉపయోగించిన మన ఇంటి గదుల్లోకి.. లాక్ డౌన్ తరువాత...  తరగతి గదులు, ఆఫీసు గదులు, వీడియో కాన్ఫరెన్స్ స్డూడియోలు, చిరు వ్యాపారుల కౌంటర్లు, చివరకు రోగుల ఆస్పత్రి గదులు  కళ్ళు మూసి తెరిచేలోపు  చొరబడ్డాయి.. ఇలా మారిన ఇళ్లల్లో ప్రశాంతంగా బతకడానికి వీల్లేకుండా..పావుగంటకు, అరగంటకు ఒకటి చొప్పున వచ్చి వాయించిపోయే మైకులు... పనులకు అంతరాయం కలిగించడమే కాక, పరమ చికాకుగా తయారయ్యాయి. ఒక్క ఫోన్ కాల్ కూడా స్పష్టంగా మాట్లాడుకోలేని పరిస్థితి

  

*     ఇల్లిల్లూ తిరిగి వ్యాపారం చేసుకొనే చిరు వ్యాపారులకు  కూతవేటు దూరంలో కస్టమర్లు ఇప్పుడు అందుబాటులో లేరు. అపార్ట్ మెంట్ వాసులు అందనంత ఎత్తులో, దూరంలో ఉండడంతో వారిని ఆకర్షించడానికి మైకులు అనివార్యమయ్యాయి. ఇది ఒకవిధంగా ఉభయులకూ పనికివచ్చే ఏర్పాటే. అయితే ఆ వెనకున్న బ్లాకులోని ఆ పై అంతస్తులో ఉండే అపార్ట్ మెంట్ల  వరకూ...అంటే దాదాపు అరకిలోమీటరు పరిధిలోని అందరికీ వినిపించేంత పెద్దగా వీరీ మైకులను సెట్ చేస్తున్నారు. ఈ పిలుపు విని... కస్టమర్లు వచ్చే దాకా ఈ మైకులు చెవులు కోసిన మేకల్లా అరుస్తూనే ఉంటాయి.

   

*     పర్యావరణ పరిరక్షణ చట్టాలు, శబ్ద కాలుష్య చట్టాలు వీటి తాలూకు కోర్టుల తీర్పులు  అన్నీ...రాత్రి 10 గంటలనుంచీ, ఉదయం 6 గంటల లోపు పరిస్థితులను మీరు నియంత్రించడానికి మాత్రమే వీలు కల్పిస్తున్నాయి. అయితే ఈ చట్టాలు ఎక్కువగా మతపరమైన, వేడుకల సందర్భాల్లో ప్రయోగించడానికి ఉద్దేశించినవి కావడంతో మీరు కఠినంగా వ్యవహరించినా ఇబ్బందేమీ ఉండేది కాదు. చిరు వ్యాపారులేమో ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంట ల వరకు వరస కడుతున్నారు. వారి సమస్య కూడా పూర్తిగా  భిన్నమైనది. అందువల్ల వీరి జిీవికకు ఇబ్బంది కలుగకుండా ...అలాగే  ఇళ్ళ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం ఉండేవిధంగా చూడాల్సి ఉంటుంది. 


 దీనిని అత్యంత ప్రాధాన్యతగల సమస్యగా పరిగణించి వెంటనే తగు చర్యలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నా.

 

 

-        చినవ్యాసుడు,

Active Citizens Club

chinavyasudu@gmail.com



 

మ..మ్మ....మ్మాస్క్


మ..మ్మ....మ్మాస్క్ 


తలకు కడితే ‘తలపాగ’
కళ్ళను కప్పేస్తే ‘గంత’
ముక్కును మూసేస్తే ‘మాస్క్’
నోటికి తాళం వేస్తే ‘చిక్కం’
మెడకు చుడితే ‘స్కార్ఫ్’
ఛాతీపైకి చేరిస్తే ‘బ్రా’
మొలను దాచేస్తే ‘గోచీ’
పాదాలను పట్టేస్తే ‘సాక్స్’
చెప్పినవన్నీ చేసేస్తే ‘చేతిరుమాలు’

మూరెడు, జానెడే కదా అని 
నన్ను తేలిగ్గా తీసిపారేయకండి...
‘మాస్కో రక్షతి రక్షితః’


-   చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com

 


.......

ఈ హెడ్డింగులో ‘బూతు’ కనిపిస్తే అది అక్షరాలా మీ దృష్టిదోషమే..! ! !


 

సాక్షిక్లిప్పింగ్ ఇది. ఈరోజు(11జులై, 2021) పేపర్లోది. సూటిగా చూడండి.‘ కృష్ణ తులాభారం’-అందరికీ తెలిసినదే. దాన్ని ప్రస్తుత కృష్ణా జలాల వివాదానికి అన్వయిస్తూ...అత్యుత్సాహంతో ష్ణాఅని దీర్ఘం ఇచ్చేసారు. ఎందుకు..?? ? అంటే..  ఇది శ్రీకృష్ణుడికి సంబంధించినది కాదు, ‘కృష్ణానదికి సంబంధించినది అని చెప్పడానికి. హెడ్డింగును వంకర దృష్టితో చూడండి. దీర్ఘంతో బూతుపదంలాగా కనిపిస్తే అది ఎవరి తప్పు...వంకరగా చూసినోళ్ళదే తప్ప మరెవరిదీ కాదని అనుకుందాం ప్రస్తుతానికి...  రంగుల్లో తేడా చూపించారులే అని సర్దుకుపోవడానికి వీల్లేకుండా  మరో పేజీలో రంగులు లేకుండా  రిపీట్ చేసారు...కాస్తలో కాస్త ఉపశమనం...తులా’ లో ‘ల’కు దీర్ఘం తీసేయలేదు, తరువాత స్పేస్ ఇవ్వలేదు. ఓవర్ ఆల్ గా వ్యాకరణ రీత్యా తప్పా ,  రైటా ?  అన్నది కాదు,  రాయడంలో పదాల మధ్య స్పేస్ ఇస్తాం. చదివేటప్పుడు అలా  కాకుండా ఏకబిగిన చదివేస్తాం.  అందువల్ల చూడంగానే,  చదవంగానే  రకరకాల భావనలకు, అర్థాలకు, పెడర్థాలకు  అవకాశమీయకుండా ఉంటే బాగుండేది.

 https://epaper.sakshi.com/c/61734507

 

ఇటువంటివి వార్తాపత్రికల్లో మామూలే... కాలంతో పోటీపడి పనిచేసేటప్పుడు ఆ సమయానికి తోచనివి ఇలా ప్రింటయి బయటికి వచ్చినప్పుడు ....ఎబ్బెట్టుగా కనిపిస్తాయి....అయితే దురుద్దేశంతో చేసినవి కావు కాబట్టి పాఠకులు సహృదయంతో సూటిగానే చూస్తారు తప్ప చూడమన్నా వంకరదృష్టితో చూడరు. ఒకవేళ చూపు ఆ వైపుకు వాలినా...కొద్దిసేపు ముసిముసిగా నవ్వుకుని క్షమించేస్తారు....సందర్భం వచ్చింది కాబట్టి వీరిని సమర్ధించడానికి ఇటువంటిదే  వెనకటి సంఘటన  ఒకటి ప్రస్తావిస్తా...

 

కంప్యూటర్లు లేని రోజులవి..  లెడ్ తో(సీసం-లోహం) చేసిన అక్షరాలను చేత్తో కూర్పు చేసే పని ( కంపోజింగ్ )అమల్లో ఉన్న రోజుల్లో...ఒక ప్రముఖ దిన పత్రిక ‘‘శ్రీశైలం  జల విద్యుచ్ఛక్తి....అని ఇలాగే తాటికాయంత అక్షరాల్లో 84 పాయింట్లో...బ్యానర్ వార్త (మొదటి పేజీ పైభాగంలో) సిద్ధం చేసింది. అర్ధరాత్రి ఫైనల్ గా మిషిన్ ప్రూఫ్ కూడా చూసేసిన న్యూస్ ఎడిటర్ -ప్రింటింగ్ కు ఆర్డరిచ్చి వెళ్ళిపోయాడు. ముద్రణా యంత్రాల దగ్గర సిబ్బంది... ఆ పేజీని ప్రింటింగ్ కు రెడీ చేస్తున్న క్రమంలో శ్రీశైలంతరువాత స్పేస్ గా ఉంచిన లెడ్ జారిపడిపోయింది. అక్కడి సహాయకుడు  వెంటనే అది గమనించి ప్రింటింగ్ కు ఆలస్యం అవుతున్నదన్న హడావిడిలో దాన్ని తీసుకెళ్ళి ‘శ్రీశైలం’ అనే పదంలో ... లంతరువాత ఉంచాల్సిన దాన్ని  శ్రీశైతరువాత గుచ్చేశాడు. దానితో.. తరువాత ఉన్న లంకాస్తా పక్కనే ఉన్న జలపదంతో కలిసిపోయింది. మొత్తంగా చూస్తే ఎలా కనిపిస్తుందో మీరే చూసుకోండి..సభ్యత అడ్డొస్తున్నది... 

ముద్రణలో జాగ్రత్తగా లేకపోతే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టే...ఇటువంటి వాటిని ముద్రారాక్షసాలు అంటాం.

వెనకటివి ఇంకా చాలా గుర్తుకొస్తున్నాయి....దీన్ని సాకుగా చేసుకుని అవన్నీ  ఇక్కడ ఏకరువు పెట్టడం భావ్యం కాదు...

అందుకే ఇటువంటివి జరగకుండా మరింత జాగ్రత్తపడాలని మీడియా మిత్రులను మృదువుగా హెచ్చరిస్తున్నా....

.................

ఏ పత్రికను ఎవరు ఎక్కువ చదువుతారు

 


 

సాక్షి :  తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక

ఆంధ్రజ్యోతి :  వై.ఎస్.ఆర్.సి.పి, తెరాస పార్టీల్లో  అందరూ తప్పనిసరిగా చదివే పత్రిక

ఈనాడు:  చదవకపోయినా అన్ని పార్టీలవారూ తప్పక కొని, ఇంటికి తెప్పించుకొనే పత్రిక

నమస్తే తెలంగాణ :   కేసిఆర్ కుటుంబ సభ్యుల్లో అత్యధిక ఆదరణ ఉన్న పత్రిక

విశాలాంధ్ర, ప్రజాశక్తి :  ఆయా  పత్రికల సంపాదకవర్గంలో అత్యధికులు చదివే పత్రిక

The Hindu :  చూడకపోయినా, చదవకపోయినా ప్రతి రాజకీయ నాయకుడి చేతిలో, కారులో, కార్యాలయంలో తప్పనిసరిగా ఉండే పత్రిక



 

 

 

 

 

 

శాస్త్రే ప్రమాణం : శాస్త్రం కానే కాదు

 


శాస్త్రం(మత గ్రంథం) స్టాటిక్.  అంటే  ఎటువంటి మార్పులకు అవకాశం లేకుండా స్థిరంగా ఉంటుంది, శిలా శాసనం లాగా.  కానీ శాస్ర్తి(మతాచార్యుడు /ప్రవక్త/ గురువు /బోధకుడు / ప్రవచనకర్త) అలాకాదు డైనమిక్, కాలానుగుణంగా మారుతుండేవాడు, మార్పులు సూచించగల యోగ్యతకలవాడు. శాస్ర్తి అంటే ఒక నిర్దిష్ట కులంవాడని కాదు లేదా వంశానుగతంగా  ఆ టైటిల్ ను తగిలించుకున్నవాడు అసలే కాదు.శాస్త్రి అంటే శాస్ర్తాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు, నిష్పాక్షికంగా, విశాల హృదయంతో, ధార్మికంగా వాటిని విశ్లేషించగల, వ్యాఖ్యానించగల సత్తా, సామర్ధ్యాలున్నవాడు.  సైన్స్ (విజ్ఞాన శాస్త్రం) విషయంలో కూడా  సైంటిస్టు చేసే కొత్త కొత్త ఆవిష్కరణలనుబట్టి  సైంటిస్టే ప్రమాణం, సైన్సు ప్రమాణం కాదు.



మనదేశం, మన ధర్మ శాస్త్రాల  విషయానికొస్తే-గతంలో రాజులు, రాజ్యాలు మారినప్పుడల్లా వారి పాలనకు తగిన నియమాలు, శాసనాలు అవసరం అయ్యేవి. ఇప్పటి భాషలో చెప్పాలంటే రాజ్యాంగం అవసరమయ్యేది. అప్పటికి వారికి అందుబాటులో ఉన్న ఋషుల సాయంతో అలా వారు రాయించుకున్న రాజ్యాంగ నియమాలే ధర్మశాస్త్రాలు లేదా స్మృతులు. మనుస్మృతి, కాత్యాయన స్మృతి, పరాశర స్మృతివంటివి.లేదా సమాజగతిని నియంత్రించడానికి, సన్మార్గంలో పెట్టడానికి అప్పటి రుషులే(మేధావులే) ధర్మశాస్త్రాలను కాలానుగుణంగా రూపొందిస్తూ వచ్చారు.

సనాతన ధర్మాన్ని ముక్కలు చెక్కలుగా చీల్చి...శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, గాణపత్యులు...ఇలా ఎవరి వాటా గొప్పదనివారు కీచులాడుకుంటున్న నేపథ్యంలో ఆదిశంకరాచార్య ఒక వ్యూహాన్ని అమలు చేసాడు. ఛాందసంగా ఎవరి పట్టు వారు వదలకుండా ఉండడాన్ని గమనించి ఒక సాధనాన్ని ముందుకు తెచ్చాడు. దాని పేరు వాదన. వాదనలో ఎవరు ఓడితే వారు ప్రత్యర్థుల సిద్ధాంతానికి తలవంచి దానిని భుజానికెత్తుకోవాలి, తనను ఓడించిన పాత సిద్ధాంతానికి(వాదానికి) నీళ్ళు వదలాలి. ఇదీ షరతు. దానికి దేశమంతా తిరిగి అందరినీ వాదనల్లో ఓడించి తన దారికి తెచ్చుకుని...అందరూ ఒక తల్లి బిడ్డలే అని హైందవధర్మానికి పుట్టిన కొమ్మలు, రెమ్మలే అని ఒప్పించి  హైందవం- మతం కాదు, జీవన విధానంఅని ప్రకటించాడు.

మరి  ఈ జీవన విధానం స్టాటిక్ గా ఉంటుందా ? ఉండదు. అది చలనశీలం కలది కదా ! అయితే చలనం కూడా అడ్డదిడ్డంగా ఉండకుండా ఒక నదిలాగా ప్రవహించేలా, అది జనసామాన్యానికి ఉపయోగపడడానికి వీలుగా దాని ప్రచారానికి, ఆచరణకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసాడు. అంటే దీని మూల సూత్రం...చలనశీలత. సంకుచితత్త్వానికి అవకాశం లేని- వాదన’( చర్చ)తో జీవన విధానాన్ని వికసింపచేసుకుంటూ ముందుకు సాగడం. అంటే ఓపెన్ మైండ్ తో ఉండడం. అలాకాక, శాస్త్రమే(హిందూ ధర్మశాస్త్రాలే) ప్రమాణం అన్నప్పుడు మనం ఓపెన్ మైండ్ తో ఉండం, అది-క్లోజ్డ్అని బోర్డ్ పెట్టినట్లవుతుంది.  జీవన విధానం అని ప్రకటించుకున్న హైందవానికి, చాలా ఇతర మతాలకు తేడా ఎక్కడుందీ అంటే..వందల ఏళ్ళనాటి ఇతర మత గ్రంథాలు శిలా శాసనాలు. యథాతథంగా తప్ప మరోవిధంగా చెప్పకూడదు, వాటితో విభేధించకూడదు-అని వాళ్ళు మేకులు దిగ్గొట్టారు. అది అంతే. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. Open minded fool is better than a closed minded scientist. అంటే చెవుల్లో సీసం పోసుకుని.. చెప్పింది వినడానికి ఇష్టపడని శాస్త్రవేత్తకంటే  చెప్పింది వినే మూర్ఖుడు ఎంతో మేలు-అని. వినగా వినగా మూర్ఖుడు ఏదో ఒకనాటికి వివేకవంతుడవుతాడని నమ్మకంగా చెప్పగలం కానీ, చెవులు మూసుకున్న శాస్త్రవేత్త తన మూర్ఖత్వానికి తాను సజీవ సమాధి అయిపోవడం తప్ప తనకు గానీ తనను నమ్ముకున్న వారిని గానీ ఉద్ధరిస్తాడన్న గ్యారంటీ ఇవ్వలేం.

కాలం మారుతున్నది. జీవన విధానం మారుతున్నది. అయినా మనం శాస్త్రమే ప్రమాణం అనడం ఆదిశంకరాచార్యులవారి వాదన, చర్చ అనే మౌలిక సూత్రాలను వ్యతిరేకించడమే అవుతుంది. చార్వాకులనుకూడా గౌరవించి, వారికి కూడా తట్టని సందేహాలు లేవనెత్తి తన ధర్మాన్ని ఎలా ప్రశ్నించి నిలదీయవచ్చో సనాతన ధర్మమే నేర్పింది కదా ! ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లోకసాధారణం. ప్రశ్నించడాన్ని నేర్పడం అసాధారణం. అది ఒక్క సనాతనధర్మానికే చెల్లింది.  నిజానికి అదే దాని బలం. వేల సంవత్సరాల మనుగడకు అదే ఆధార శిల. మరి  ఆ సాధనాన్ని మనమే మూలనపడేస్తే ఎలా ? కాలానుగుణంగా జీవన శైలిలో వచ్చిన మార్పులు చర్చకు పెట్టి, సనాతన ధర్మ మౌలికతకు, భారతీయ ఆత్మకు హాని కలగకుండా ధర్మశాస్ర్తాలను తిరగ రాయడం తక్షణ కర్తవ్యం. ఈ విధమైన కాలానుగుణ సంస్కరణ కేవలం హిందూ మతానికే కాదు, అన్ని మతాల మనుగడకు, ప్రశాంత సామాజిక జీవనానికి, అభ్యున్నతికి అత్యావశ్యకం. తరం మారినప్పుడు స్వరం కూడా మారుతుంటుంది. స్వరానికి తగ్గట్టు తరం మారకపోతే, అపశ్రుతులతో వ్యవస్థంతా అస్తవ్యస్తమవుతుంది,

దీనికేం చేయాలి ?

దేశవ్యాప్తంగా హైందవ ధర్మానికి చెంది, ప్రజల విశ్వసనీయత పొందిన అన్ని పీఠాలు, మఠాలు, సంస్థల అధిపతులు లేదా ప్రతినిధులతో ఒక విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి.  అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం.  అయినా అదే ఫైనల్ అని తీర్మానించకుండా ఎప్పటికప్పడు  దానికి సవరణలు చేసుకుంటున్నాం. మౌలికతకు భంగం వాటిల్లకుండా ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మార్పులు చేసుకుంటూనే, ముందు తరాలవారు సవరణలు చేసుకోవడానికి కూడా వీలు కల్పించాలి. ఒకే పదానికి ఉన్న పలు మాండలికార్థాలతో మనం నిఘంటువును రూపొందించుకుంటున్నట్టు గానే విశాల భారతావని లోని పలు రకాల స్థానిక ఆచార వ్యవహారాలకు సరిపోయేవిధంగా సూత్రీకరణలు చేయాలి. ఒకే పండుగకు భిన్న తేదీలను  ప్రకటించడం,  శుభముహూర్తాలు మరో మూణ్ణెల్లు లేవని ఒకడంటే మరొకడు దాన్ని ఖండించేటటువంటి, సామాన్య ప్రజానీకాన్ని అయోమయానికి గురి చేసే పరిస్థితులు పోవాలంటే ఇటువంటి కృషి జరగాలి.

వృత్తులనుబట్టి కులాలు ఏర్పడిన మాట అందరూ అంగీకరించేదే. కానీ బిడ్డ చచ్చినా పురిటికంపు చావనట్లు, వృత్తులు అంతరించినా కులవ్యవస్థ కొనసాగుతుండటం, బలపడుతూ ఉండడం విడ్డూరం. ఇది సున్నితమైన సమస్యే కానీ, పరిష్కరించడానికి అసాధ్యమయిన సమస్యేమీ కాదు. రాజకీయస్పర్శ తగలకుండా జాగ్రత్తపడితే దీర్ఘకాల పరిష్కారదిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేయవచ్చు.

రాజకీయాలకు అతీతంగా, ఛాందస మతవాదులకు, వారి సిద్ధాంతాలకు అతీతంగా, సనాతన ధర్మపరిధిలో, విశాల దృక్పథంతో, ప్రగతిశీల, ఆధ్యాత్మిక చట్రంలో పకడ్బందీగా దీని  సంకలనం సాగాలి. దొంగస్వాములు, దొంగబాబాలు, కపట సన్నాసులకు అవకాశంలేకుండా, క్షుద్రవిద్యలు, మూఢనమ్మకాలతో అమాయకజనాన్ని మోసపుచ్చే వారిని నియంత్రించే విధంగా ఉండాలి.

ప్రాచీనకాలంనాటి గురుకుల విద్యాభ్యాసం, ఉంఛవృత్తిలాంటి పద్ధతులను పునర్నిర్వచించాలి. అన్ని  సంస్కృత, వేదపాఠశాలలవంటి విద్యాలయాలన్నింటిలో అక్షరాభ్యాసంనుండీ పిహెచ్ డి వరకు సంస్కృతంతోపాటూ ఇంగ్లీష్ ను కూడా పూర్తిస్థాయిలో బోధించాలి. ఇటువంటి చోట్ల విద్యార్థులను చేర్చడానికి తల్లిదండ్రులు సుముఖంగా ఉంటారు, అదికూడా పెద్దసంఖ్యలోనే. కానీ సమస్యంతా బోధకుల దగ్గరే వస్తుంది.  దీనికి మంచి పరిష్కారం రామకృష్ణమఠం నమూనాను అనుసరించడమే. శిక్షణ ద్వారా వారు చాలామంది స్వామీజీలను సిద్ధం  చేస్తుంటారు. అధునాతన సాంకేతికను విరివిగా ఉపయోగించుకుని ఆన్ లైన్ వంటి వాటి ద్వారా రీచ్ పెంచుకోవాలి.  సనాతన ధర్మం, భారతీయతను అధ్యయనం చేయడానికి విశ్వవిద్యాలయాల్లో పీఠాల(Seat of Higher learning) ఏర్పాటును ప్రోత్సహించాలి.

అన్ని జాడ్యాలకు మూలవేరు ఆర్థికం. కాబట్టి రాజకీయ పార్టీల ఫండింగ్ విషయంలో మన రాజ్యాంగం చేసిన తప్పులు, కప్పదాట్లవంటి వాటికి అవకాశంలేకుండా మనిషి, సమాజాల వికాసం (ఆధ్యాత్మికంగా) సకలజన సమ్మతంగా(సనాతన ధర్మపరిధిలో) సాగే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వంటి సంస్థల భాగస్వామ్యం, , నియంత్రణ, నిర్దేశకత్వం ఉండేవిధంగా ఈ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి.

పండుగలు, పెళ్ళిళ్ళవంటి శుభకార్యాల్లోగానీ, చావులవంటి కర్మకాండల్లోగానీ ఇప్పటికే నగరాల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆచారాలు, వ్యవహారాల్లో మార్పులు ఏవయినప్పటికీ వాటిని గాలివాటానికి వదిలేసేబదులు, ధర్మబద్ధంగా, ఆచరణయోగ్యంగా క్రమబద్ధీకరిస్తూ సూత్రీకరణలు జరగాలి.  అయితే ఇక్కడ ప్రస్తావించినవన్నీ సులభసాధ్యంకాదని తెలుసు. అందుకే కొండను తవ్వాలంటే శిఖరంపైకెక్కి కాదు గునపం దించాల్సింది. ఒక పక్కనుంచి కొద్దికొద్దిగా తొలుస్తూ పోవాలి. అంటే ప్రత్యక్ష సంస్కరణలకు పూనుకోకుండా, ఆదేశిక సూత్రాలవంటివి జారీచేయకుండా, మినహాయింపులు, సర్దుబాట్లతో శ్రీకారం చుడితే  ఆశించిన లక్ష్యాలు తరం మారే లోపే చూడొచ్చు.

 

-     - చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com


చిరు విన్నపం :

మిత్రమా !  కాలక్షేపం కోసమో, కీర్తికండూతితోనో  ఇవి రాయడం లేదు

చూడకూడనివిచూస్తూ, వినకూడనివి వింటూ, జరగకూడనివి  నిరాటంకంగా జరుగుతూ పోతూ ఉంటే.... నరనరాలన్నీ ఒక్కొక్కటిగా చిట్లిపోతుంటే.. మౌనంగా ఉండలేక చేస్తున్న ప్రయత్నాలు ఇవి. లక్షల మెదళ్ళను రగిల్చే శక్తి అక్షరాలకు ఉంది.  వీటిని చదివి వదిలేయకండి...నచ్చితే నలుగురికీ షేర్ చేయండి(మార్పులు చేయకుండా)....వీలయినంత త్వరగా పరిష్కారం కోసం దీనికి విస్తృత ప్రచారం కల్పించండి, మీ పరిధిలో.. మీ-చిన వ్యాసుడు.


నిత్యనూతన భ్రాంతి

  మా తాతకు...  పుట్టిపెరిగిన ఊరు కైలాసానికి కోసుదూరం పిల్లల కాలానికి అది కరతుమ్మలు , జిల్లేళ్ళమయం   మా నాన్నకు...  పుట్టిపెరిగిన ఊరు వైకుంఠా...